ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తాం: తాడిపర్తిలో భావోద్వేగానికి గురైన షర్మిల
వనపర్తి జిల్లాలోన తాడిపర్తి గ్రామంలో ఆత్మహత్య చేసుకొన్న కొండల్ కుటుంబాన్ని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం నాడు పరామర్శించారు. నిరుద్యోగ వారంలో భాగంగా ఆమె ఇవాళ నిరసనకు దిగారు.
వనపర్తి: రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించడమే తమ పార్టీ లక్ష్యమని వైఎసాఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.వనపర్తి జిల్లాలోని తాడిపర్తి గ్రామంలో ఆత్మహత్య చేసుకొన్న కొండల్ కుటుంబాన్ని షర్మిల మంగళవారం నాడు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. కొండల్ కుటుంబసభ్యులను ఓదార్చే సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి మంగళవారం నాడు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె చెప్పారు. ఇవాళ నిరుద్యోగ వారంలో భాగంగా తాడిపర్తికి వచ్చినట్టుగా షర్మిల తెలిపారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు.
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తమ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తామని షర్మిల తెలిపారు. ఈ నెల 8వ తేదీన షర్మిల తెలంగాణలో పార్టీని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు. అంతేకాదు వంద రోజుల్లో పాదయాత్ర కూడ చేస్తానని షర్మిల వెల్లడించిన విషయం తెలిసిందే.