ఆ రెండు తేదీలే: పార్టీ ప్రకటనపై షర్మిల కసరత్తు
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల వేగంగా కార్యాచరణను సిద్దం చేస్తోంది.
హైదరాబాద్:తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల వేగంగా కార్యాచరణను సిద్దం చేస్తోంది.
ఈ ఏడాది మార్చిలో పార్టీ ఏర్పాటు విషయాన్ని ఆమె ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అయితే మార్చి మాసంలో కాకుండా ఈ ఏడాది మే లేదా జూలై మాసాల్లో ఏదో ఒక తేదీన పార్టీ ఏర్పాటును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ఏడాది మే 14 లేదా జూలై 8వ తేదీలలో ఏదో ఒక తేదీలో పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మే 14వ తేదీనే ప్రమాణం చేశారు.అదే రోజున పార్టీని ఏర్పాటు చేయాలని చేస్తే ఎలా ఉంటుందనే విషయమై షర్మిల వైఎస్ఆర్ అభిమానులతో చర్చిస్తున్నట్టుగా సమాచారం. జూలై 8వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి.
రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని పార్టీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని కూడ ఆమె చర్చిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
జూలై 8వ తేదీ అయితే ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో మే మాసంలోనే పార్టీని ప్రకటించాలనే డిమాండ్ కూడా లేకపోలేదు. దీంతో షర్మిల ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీని ఫైనల్ చేసే అవకాశం ఉందంటున్నారు.
మరోవైపు మార్చి మాసంలోనే పార్టీ ప్రకటన చేసి ప్రజల్లోకి వెళ్లాలని మరికొందరు కూడ సూచిస్తున్నారు.పార్టీ ప్రకటనకు ముందే రాష్ట్రంలో నెలకొన్న స్థితిగతులపై వైఎస్ఆర్ అభిమానులతో చర్చించి వాస్తవ పరిస్థితులను తెలుసుకొన్న తర్వాతే పార్టీ ఏర్పాటు విషయమై షర్మిల ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.