హరీశ్, కొప్పుల ఈశ్వర్ ముందే.. గడియారం పగులగొట్టి, గొడుగు చించేసి, ఈటలకు షాకిచ్చిన యువకుడు
హజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట సభలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఎదుట కొందరు యువకులు గడియారాలు ధ్వంసం చేశారు. ఈటల రాజేందర్ ఇచ్చినవాటిగా పేర్కొంటున్న గడియారాలను ఆదివారం పగులగొట్టారు.
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీలు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ క్రమలో మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ కు జమ్మికుంటలో ఓ యువకుడు షాకిచ్చాడు. ఈటల తరపున పంచి పెట్టిన వాల్ క్లాక్ పగలగొట్టి గొడుగులను చింపేసి నిరసన తెలిపాడు.
ఆదివారం జమ్మికుంటలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ హాజరైన సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ ఇస్తున్న గడియారాలు , గొడుగులు ఆర్ధిక భరోసానిస్తాయా అని సదురు యువకుడు ప్రశ్నించాడు. దళిత వాడల్లో గడియారాలు, గొడుగులు పంచిపెడితే నిరాకరించానని వివరించాడు. ఇదే సమయంలో అతడి చర్యను చూస్తూ మంత్రులు హరీశ్రావు, కొప్పుల, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి పగలబడి నవ్వుకున్నారు.
అంతకుముందు హరీశ్ రావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విద్య, వైద్య వ్యవస్థను బలోపేతం చేసే అలోచనలో సీఎం కేసీఅర్ ఉన్నారని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యపై పెట్టే ఖర్చు ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువని హరీష్ అన్నారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన ప్రైవేట్ ఉపాద్యాయులకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ప్రైవేట్ టీచర్లను భాగస్వాములు చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.