Asianet News TeluguAsianet News Telugu

నిలకడగా లేదు.. ఐసీయూలోనే చికిత్స : కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

బీఆర్ఎస్ సీనియర్ నేత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్ధితిపై యశోదా ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు  . ఐదు రోజుల పాటు ఇలాగే కొనసాగిస్తామని.. ప్రభాకర్ రెడ్డిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు వున్నాయని యశోదా వైద్యులు పేర్కొన్నారు. 

yashoda hospital released bulletin on brs mp kotha prabhakar health condition ksp
Author
First Published Oct 31, 2023, 5:19 PM IST

బీఆర్ఎస్ సీనియర్ నేత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్ధితిపై యశోదా ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా వుందని చెప్పలేమని.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వారు తెలిపారు. ఐదు రోజుల పాటు ఇలాగే కొనసాగిస్తామని.. ప్రభాకర్ రెడ్డిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు వున్నాయని యశోదా వైద్యులు పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్ రావు.. యశోదా ఆసుపత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. ఇలాంటివి రాయలసీమ, బీహార్‌లోనే చూశామని, వీటిని తెలంగాణ సమాజం హర్షించదని హరీశ్ రావు స్పష్టం చేశారు. విపక్షాలు అధికార పక్షాన్ని అపహాస్యం చేస్తున్నాయని.. రెండ్రోజుల్లోనే కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి వెనుక కుట్ర కోణాన్ని ఛేదిస్తారని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు.

Also Read: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి: రాజు మొబైల్ డేటాను పరిశీలించనున్న పోలీసులు

కాగా.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన  రాజు అనే వ్యక్తి  మొబైల్ కాల్ డేటాను  పోలీసులు పరిశీలించనున్నారు. సోమవారం  దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో  ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని  తిరిగి వెళ్తున్న సమయంలో  కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన  ప్రభాకర్ రెడ్డి గన్ మెన్  దాడిని అడ్డుకున్నారు. లేకపోతే ప్రభాకర్ రెడ్డికి  తీవ్ర గాయాలై ఉండేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

ఈ దాడితో ఆగ్రహంతో  రాజును  బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని చితకబాదారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజును  అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన రాజును సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో రాజు చికిత్స పొందుతున్నారు. మరో వైపు  వారం రోజులుగా  రాజు ఎవరెవరితో మాట్లాడారనే విషయమై పోలీసులు  ఆరా తీయనున్నారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి వెనుక కుట్ర కోణం ఉందా, లేక ఇతరత్రా కారణాలున్నాయా అనే  కోణంలో  పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి సికింద్రాబాద్  యశోదా ఆసుపత్రిలో  సోమవారం నాడు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆయనను సీఎం కేసీఆర్ పరామర్శించి.. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios