యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెను ఆకస్మికంగా బదిలీ చేస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.
హైదారబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు. పైగా, ఆమెకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.
అనితా రామచంద్రన్ స్థానంలో వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా పనిచేస్తున్న పమేలా సత్పథిని యాదాద్రి జిల్లా కలెక్టర్ గా నియమించారు. ఆమె 2015 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. 2016 అక్టోబర్ 11వ తేదీన కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి అనితా రామచంద్రన్ యాదాద్రి, భువనగిరి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు.
సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న అనితా రామచంద్రన్ ను బదిలి చేయడం కలకలం రేగుతోంది. రాష్ట్రంలో ఐఎఎస్ ల సాధారణ బదిలీల్లో భాగంగా ఆమెకు స్థానం చలనం ఉంటుందని భావించారు. కానీ ఆకస్మికంగా ఆమెను బదిలీ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
అనితా రామచంద్రన్ మీద ఆరోపణలు కూడా ఏమీ లేవు. నిరంతరం ఆమె జిల్లా అభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నారనే అభిప్రాయం ఉంది. అయితే, హరిత హారం, పల్లె ప్రగతి లక్ష్యాలను చేరుకోలేకపోవడమే ఆమె బదిలీకి కారణమని చెబుతున్నారు.
