మహిళల అక్రమ రవాణా ముఠా అరెస్ట్: మహేష్ భగవత్
మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ముఠాకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ మంగళవారం నాడు మీడియాకు వివరించారు.
ఒమన్, మస్కట్ కు మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టుగా సీపీ చెప్పారు. ఉపాధి పేరిట మహిళలను అక్రమంగా ఓ ట్రావెల్స్ సంస్థ తరలిస్తోందని ఆయన తెలిపారు.విదేశాల్లో మహిళలను వేధిస్తున్నట్టుగా తమ దర్యాప్తులో వెల్లడైంది.మలక్పేటకు చెందిన ఓ ట్రావెల్స్ సంస్థలో సోదాలు నిర్వహించిన సమయంలో ఈ ముఠాకు సంబంధించిన విషయం వెలుగు చూసిందన్నారు. ముఠాలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని సీపీ చెప్పారు.పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
విదేశాల్లో మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వ్యభిచారంలోకి దింపుతోందని మహేష్ భగవత్ చెప్పారు.మహిళల అక్రమ రవాణాకు సంబంధించి గతంలో చాలా ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.