అప్పు తీర్చమన్నందుకు: ఒంటరి మహిళను ఆ ముగ్గురు కలిసి ఇలా...
అప్పు తీర్చాలని కోరడంతో అప్పు తీసుకొన్న ముగ్గురు ఒంటరి మహిళను దారుణంగా హత్య చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పూలమ్మ అనే ఒంటరి మహిళను సాయిలు సహా మరో ఇద్దరు హత్య చేశారని గుర్తించారు.
హైదరాబాద్: తీసుకొన్న అప్పును తిరిగి చెల్లించాలని కోరిన ఒంటరి మహిళను ముగ్గురు హత్య చేశారు. నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన హైద్రాబాద్ అల్వాల్ లో చోటు చేసుకొంది.హైద్రాబాద్ అల్వాల్ పరిధిలో వెంకటాపురం లోతుకుంటలో పూలమ్మ అనే మహిళ దినసరి కూలీగా పనిచేస్తోంది. భర్తతో విడిపోయి ఒంటరిగా నివసిస్తోంది. గత నెల 25వ తేదీన ఆమె తన ఇంట్లోనే హత్యకు గురైంది.ఈ హత్య కేసుకు సంబంధించి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులుకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తే కీలక విషయాలను కనుగొన్నారు.
మృతురాలితో సన్నిహితంగా ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కానీ ఫలితం లేకపోయింది. స్థానికంగా ఉన్న సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. పూలమ్మ వద్ద సాయిలు, మంజులు, వినోదలు అప్పు తీసుకొన్నారు. అప్పు తిరిగి ఇవ్వాలని పూలమ్మ ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. పూలమ్మ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండేది.ప్రతి రోజూ ఆ వ్యక్తి ఆమెతో గడిపి వెళ్లేవాడు. ఆ వ్యక్తి వెళ్లిన తర్వాత పూలమ్మను హత్య చేస్తే అతడిపై హత్య నేరం మోపొచ్చని భావించారు.
గత నెల 25వ తేదీన ఆ వ్యక్తి పూలమ్మతో గడిపి వెళ్లిన తర్వాత మంచంపై నిద్రిస్తున్న పూలమ్మను గడ్డపారతో తలపై మోదారు. దీంతో నిద్రలోనే ఆమె మరణించింది. పూలమ్మను హత్య చేసిన మరునాడు సాయిలు ఊరికి వెళ్లిపోయాడు.గుడిసె లోపల గడియపెట్టి ఉండడం మృతురాలు మంచంపై హత్యకు గురికావడంతో పోలీసులకు సవాల్ మారింది. అయితే సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులను గుర్తించారు.సాయిలు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.