అన్న రాఖీ కట్టించుకోలేదని మనస్తాపంతో చెల్లెలు ఆత్మహత్య..!
ఆదివారం ఉదయం మమత చిన్న అన్నయ్య రమేష్ కు రాఖీ కట్టేందుకు సిద్ధం అయింది. కానీ, రమేష్ నిరాకరించాడు. తదుపరి పలుమార్లు రాఖీ కట్టించుకోవాలి అని వేడుకున్నా ఆయన పట్టించుకోకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
అన్న రాఖీ కట్టించుకోలేదని మనస్తాపంతో చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఆదివారం చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణ ఎస్ఐ శ్రీకాంత్, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని మాణిక్ ప్రభు వీధికి చెందిన బొగ్గుల మమత (20) కు ఇద్దరు అన్నయ్యలు. వీరిలో లో పెద్దన్నయ్య పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఇంట్లో అమ్మానాన్నలతో పాటు చిన్న అన్నయ్య రమేష్, చెల్లెలు మమత ఉంటున్నారు.
ఆదివారం ఉదయం మమత చిన్న అన్నయ్య రమేష్ కు రాఖీ కట్టేందుకు సిద్ధం అయింది. కానీ, రమేష్ నిరాకరించాడు. తదుపరి పలుమార్లు రాఖీ కట్టించుకోవాలి అని వేడుకున్నా ఆయన పట్టించుకోకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో మమత తీవ్రంగా మనస్తాపం చెందింది. అప్పటికే తల్లిదండ్రులు పనుల నిమిత్తం పొలానికి వెళ్లడంతో మమత ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
అయితే, ఇంట్లో పది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని ఈ క్రమంలోనే అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్ధలు ఏర్పడినట్లు కాలనీవాసులు తెలిపారు. పండగపూట విషాదం నెలకొనడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మమత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.