భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
భర్త మీద కోపంతో ఓ మహిళ చేసిన పనికి మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. కుటుంబ కలహాలు, భర్త తన మాట వినకుండా పంచాయతీకి వెళ్లాడనే కోపంతో ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలను చంపేసి.. తాను కూడా ప్రాణాలు తీసేసుకుంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని రామాపురంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చివ్వెంల మండలం అక్కలదేవి గూడేనికి చెందిన పోలిశెట్టి శ్రీనాథ్ కు నడిగూడెం మండలం చెన్నకేశవపురానికి చెందిన మౌనికతో వివాహమైంది. రామాపురంలో ఆర్ఎంపీ వైద్యుడిగా శ్రీనాథ్ పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల లాక్షిత, ఏడాదిలోపు వయసున్న బాబు ఉన్నాడు. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో వీరి గొడవలకు సంబంధించి సూర్యాపేటలో పంచాయతీకి రావాలని శ్రీనాథ్ కు బంధువులు కబురు పంపారు. ఆ పంచాయతీకి వెళ్లొద్దని.. వెళ్తే తాను బలవన్మరణానికి పాల్పడతానని మౌనిక తేల్చి చెప్పింది. తనకు చెప్పకుండా శుక్ర, శనివారం పంచాయతీకి వెళ్లిన విషయంపై ఆదివారం భర్తను నిలదీసింది.
వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్థాపానికి గురైన మౌనిక.. భర్త బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోని ఆర్చీకి రెండు వైపులా పిల్లలకు కండువాతో ఉరివేసింది. తర్వాత తాను కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
రాత్రి ఇంటికి వచ్చిన శ్రీనాథ్.. తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో... అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులను పగలగొట్టారు. భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా వేలాడుతుండటాన్ని గమనించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
