ఉత్తమ్ వర్సెస్ సైదిరెడ్డి: ఆ ఓట్లే కీలకం
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలకు లభించిన ఓట్లు ఈ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు.
హుజూర్నగర్: 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలకు లభించిన ఓట్లు ఈ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు.
గత ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీ పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి వంగాల స్వామిగౌడ్ పోటీ చేశాడు. ఈ దఫా ఈ స్థానం నుండి టీడీపీ పోటీ చేయడం లేదు.
పీపుల్స్ ఫ్రంట్ లో భాగంగా టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు కూటమిగా ఏర్పడ్డాయి. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుండి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు.టీడీపీ ఉత్తమ్ కు మద్దతిస్తోంది.
గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశారు. ఈ దఫా వైసీపీ పోటీలో లేదు. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుండి ఉత్తమ్కుమార్ రెడ్డి రెండు దఫాలు విజయం సాధించారు. మూడో దఫా ఈ స్థానం నుండి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి ఉత్తమ్ పోటీకి దిగుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ సైదిరెడ్డి బరిలోకి దిగాడు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి 23,924 ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.
వైసీపీ అభ్యర్ధి గట్టు శ్రీకాంత్ రెడ్డికి 29,657 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వంగాల స్వామిగౌడ్కు 25,353 ఓట్లు వచ్చాయి. అయితే ఈ దఫా వైసీపీ ఓట్లు ఎవరికీ పడతాయనే అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు వైసీపీ ప్రత్యర్థి. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అయితే వైసీపీ సానుభూతిపరులు ఈ కూటమికి ఓటు వేసే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ కూటమికి వ్యతిరేకంగా ఉన్న టీఆర్ఎస్ కు ఓటు వేస్తామని వైసీపీ సానుభూతిపరులు చెబుతున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో ఈ నియోజకవర్గంలో ప్రారంభించిన హౌజింగ్ ప్రాజెక్టులకు సంబంధించి లబ్దిదారులకు బిల్లులు చెల్లించలేదు. ఈ అసంతృప్తి ఉత్తమ్కుమార్ రెడ్డిపై ఉందని వైసీపీ నేత గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
ఈ స్థానం నుండి టికెట్టు దక్కని శంకరమ్మను తమ వైపుకు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. టీఆర్ఎస్ శంకరమ్మకు అన్యాయం చేసిందని ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ లో చేరితే శంకరమ్మకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వంగాల స్వామిగౌడ్కు 25,353 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు ఉత్తమ్ కు బదిలీ అవుతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరో వైపు వైసీపీ ఓట్లు టీఆర్ఎస్ కు బదిలీ అయితే జరిగే నష్టం టీడీపీ ఓట్ల ద్వారా పూడ్చుకొనే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
1999 నుండి 2004 వరకు కోదాడ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2009 నుండి 2014లలో హుజూర్ నగర్ నుండి ఉత్తమ్ విజయం సాధించారు. 2014లో కోదాడ నుండి ఉత్తమ్ సతీమణి పద్మావతి విజయం సాధించారు. రెండో దఫా పద్మావతి కోదాడ నుండి బరిలోకి దిగుతున్నారు.
90వేల మంది ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందినవారు ఉన్నారు. వీరంతా తనకు ఓటేస్తారని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన తప్పుబడుతున్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి సామాన్యులకు అందుబాటులో ఉండరని టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. తాను సామాన్యులకు అందుబాటులో ఉంటానని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు
హుజూర్నగర్: ఉత్తమ్ సీనియారిటీకి లోకల్ ట్విస్ట్