హైదరాబాద్‌లో భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వీరిని సాహితి, మనోజ్‌లుగా గుర్తించారు. రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాహితికి వనస్థలిపురానికి చెందిన మనోజ్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొత్త జంట అమెరికాలోని డల్లాస్‌కు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే తల్లిదండ్రులను చూసేందుకు మే 2న సాహితి హైదరాబాద్ వచ్చింది. ఇదే సమయంలో అమెరికాలోనే వున్న మనోజ్‌ గుండెపోటుకు గురై మృతిచెందాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అనంతరం ఈ నెల 23న మనోజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. తనను కంటికి రెప్పలా చూసుకున్న భర్త ఇక లేడని తెలిసి సాహితి కన్నీటి పర్యంతమైంది. భర్త మరణంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో అంత్యక్రియలు ముగిసిన తర్వాత సాహితి పుట్టింటికి వెళ్లిపోయింది. నాటి నుంచి ఒంటరిగా వుంటూ కుమిలిపోతోంది.

ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాహితి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి సాహితి ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.