కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సీఎం ఎందుకు లేఖ రాయడం లేదు - కిషన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తన, రేవంత్ రెడ్డి ఆదాయంపై విచారణ జరపాలని సవాల్ విసిరారు.
![Why CM is not writing a letter for CBI investigation on Kaleswaram - Kishan Reddy..ISR Why CM is not writing a letter for CBI investigation on Kaleswaram - Kishan Reddy..ISR](https://static-ai.asianetnews.com/images/01hka622ae5737x2fp1jfpwzrn/kishan-reddy-jpg_363x203xt.jpg)
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రక్షిస్తున్నారంటూ తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని అన్నారు. సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్రానికి తెలంగాణ సీఎం ఎందుకు లేఖ రాడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇంత వరకు సీబీఐతో విచారణ ఎందుకు జరిపించలేదని కాంగ్రెస్ నాయకులకు అడుగుతున్నారని కేంద్ర మంత్రి కిషర్ రెడ్డి అన్నారు. కానీ తెలంగాణలోకి సీబీఐను ప్రవేశించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టం చేసిందనే సంగతి కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సీబీఐపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని, మరి ఇప్పుడెందుకు అలా చేయడం లేదని అన్నారు.
అధికారంలో ఉన్పప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీతో జతకట్టిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని, కానీ బీజేపీ ఎప్పుడూ అలా చేయలేదని అన్నారు. తాను న్యాయ విచారణకు వ్యతిరేకం కాదని, దానిని మరింత వేగవంతం చేసేలా చూసేందుకే సీబీఐ విచారణ కోరారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీజేపీకి వాటా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, దానిని నిరూపించాలని సవాల్ విసిరారు. సలహా ఇస్తే కాంగ్రెస్ నాయకులు తన ఆదాయం గురించి మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదాయం ఎంతో, తన ఆదాయం ఎంతో విచారణ జరపాలని తెలిపారు. ఈ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం కాలయపాన చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ సంక్షేమ పథకాలకు అవసరమైన డేటా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని అన్నారు. కావాలనే దరఖాస్తుల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు, ఎమ్మెల్యే ఆఫీసుల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల కోసమే ఈ హడావిడి అంతా అని ఆరోపించారు.
అనంతరం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం గురించి కేంద్ర మంత్రి మాట్లాడారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.