సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు చొరవ తీసుకున్నారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌‌లో రోడ్ల మూసివేత సమస్యపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు చొరవ తీసుకున్నారు. రోడ్ల మూసివేత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్‌కు ఉపరాష్ట్రపతి సూచించారు. రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజయ్‌ భట్‌ ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యను అజయ్‌ భట్‌ దృష్టికి వెంకయ్యనాయుడు తీసుకెళ్లారు. రోడ్లు మూసివేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. దీనిపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని అజయ్‌ భట్‌కు ఉప రాష్ట్రపతి సూచించారు. దీనిపై స్పందించిన అజయ్ భట్ .. ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ బోర్డుతో సంబంధం లేకుండా లోకల్ మిలిటరీ అథారిటీ రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని.. కంటోన్మెంట్ యాక్ట్‌ సెక్షన్-258కి ఇది పూర్తి విరుద్ధమని కేటీఆర్‌ ఇటీవల కేంద్ర రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు.