మరో మూడురోజులు తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక
రాగల మూడురోజులు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్: ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ జలాశయాలన్నీ నిండుకుండల్లా మారాయి. అయితే ఈ వర్షాలు మరో మూడురోజులు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కాబట్టి నదులు, జలాశయాలు, వాగులు, నీటికుంటల పరిసర ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.
సోమవారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ చత్తీస్ ఘడ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉందని... దీనికి ఉపరితల ఆవర్తనం తోడయ్యిందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. అల్పపీడనం విశాఖపట్నం మీదగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని... దీని ఫలితంగా రాగల మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించారు.
read more భారీ వర్షాల హెచ్చరికలు: ఐదు జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్
ఇవాళ(మంగళవారం) రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. అలాగే రేపు(బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని... ఎల్లుండి(గురువారం) కూడా తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు, వరంగల్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని వెల్లడించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.