ఈఎస్ఐ స్కాం: వెంకటేశ్వర హెల్త్ సెంటర్ యజమాని అరెస్ట్
ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.ఈ కేసుతో సంబంధాలు ఉన్న వారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఆదివారం నాడు ఏసీబీ అధికారులు అరవింద్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్:ఈఎస్ఐ స్కాంలో ఆదివారం నాడు హైద్రాబాద్ సుచిత్రలోని వెంకటేశ్వర హెల్త్ సెంటర్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వెంకటేశ్వర హెల్త్ సెంటర్ యజమాని అరవింద్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఈఎస్ఐ స్కాంలో ఏ-2 నిందితురాలు పద్మకు అరవింద్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పద్మ ఇచ్చిన సమాచారం మేరకు సుచిత్రతో పాటు దూలపల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈఎస్ఐ అధికారులకు లంచాలు ఇస్తూ భారీగా డబ్బులు సంపాదించినట్టుగా ఏసీబీ అధికారులు చెబుతున్నారు. జనరల్ మెడిసిన్, సర్జికల్ కిట్స్, ఇతర మెడిసిన్స్ ను అరవింద్ రెడ్డి విక్రయించేవాడని గుర్తించారు.
తప్పుడు బిల్లులను సృష్టించి నిధులను మింగేశారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఈఎస్ఐ స్కాంలలో అరవింద్ రెడ్డి పాత్ర ఉందని ప్రాథమికంగా గుర్తించారు.ఈ విషయమై అరవింద్ రెడ్డి పాత్ర గురించి ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఈ కేసులో ఏపీలో కూడ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.