వరవరరావు కూతురు విజ్ఢప్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన
ప్రముఖ విప్లవ కవి వరవరరావు ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. తన తండ్రికి బెెయిల్ ఇచ్చి విడుదల చేయాలని వరవరరావు కూతురు కోరారు. దానిపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి వరవరరావు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలోని జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరవరరావు ఆరోగ్యంపై ముంబై కోర్టు నివేదిక కోరింది. వీవీ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ముంబై కోర్టు జేజే ఆస్పత్రి సూపరింటిండెంట్ ను ఆదేశించింది.
తన భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణింంచినట్లు తమకు అందుతోందని, బేషరతుగా ఆయనను విడుదల చేయాలని వరవరరావు భార్య హేమలత అన్నారు. ఈ విషయంపై కోర్టులో కేసు వేస్తున్నట్లు ఆమె తెలిపారు.
Also Read: విరసం నేత వరవరరావు ఆరోగ్యం విషమం: ఆసుపత్రికి తరలింపు
తమ తండ్రిని చూడడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమంతించిందని, అయితే మహారాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుమతించడం లేదని వరవరరావు కూతురు పవన అన్నారు. తమకు సకాలంలో సమాచారం అందించలేదని ఆమె అన్నారు. తన తండ్రికి వెంటనే తాత్కాలిక బెయిలు మంజూరు చేసి విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె కోరారు.
వరవరరావుతో వీడియో కాల్ చేయించాలని ఆమె కోరారు. వరవరరావు కరోనా పరీక్షలు నిర్వహించారని, నెగెటివ్ వచ్చిందని ఆమె చెప్పారు. ఆస్పత్రిలో చేరిన వరవరరావును చూడడానికి ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం వ్యవహారాలు చూడడడానికి ఓ అధికారిని కూడా నియమించింది.
ఇదిలావుంటే, వరవరరావు కూతురు పవన విజ్ఢప్తిపై తెలంగాణకు చెందిన కేంద్ర సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. చట్టపరిధిలో తాను చేయాల్సినంత చేస్తానని ఆయన చెప్పారు. మానవతా దృక్పథంతో ఆలోచిస్తానని అన్నారు. కొన్ని విషయాలు బయటకు చెప్పలేమని కిషన్ రెడ్డి అన్నారు.