వనస్థలిపురంలో కవిత మృతి కేసు: చంపేసి కరోనా డ్రామా, భర్త విజయ్ అరెస్టు
హైదరాబాదులోని వనస్థలిపురంలో వివాహిత అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భార్యను చంపేసి కరోనాతో మరణించినట్లు భర్త విజయ్ డ్రామాలు ఆడినట్లు గుర్తించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురంలో గల వైదేహినగర్ లో మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భార్య కవితను భర్త విజయ్ చంపేసి కరోనాతో మరణించిందని నాటకమాడినట్లు గుర్తించారు. విజయ్ మీద అనుమానంతో కవిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హత్య చేసిన తర్వాత కవిత మృతదేహానికి గుట్టుచప్పుడు కాకుండా విజయ్ అంత్యక్రియలు చేశారు. కవిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి కవిత మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేయించారు. దీంతో ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.
కవితను హత్య చేశాడనే ఆరోపణపై విజయ్ ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. తన భార్య కవిత కరోనాతో మరణించిందని చెప్పి గత నెల 27వ తేదీన నల్లగొండ జిల్లాలోని గ్రామంలో అంత్యక్రియలు చేశాడు. విజయ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చి కవిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కవిత భర్త విజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవని చెబుతున్నారు.