Uttam Kumar Reddy: 50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయంగా నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. తాజాగా టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గాల నుంచి తాను, తన భార్య ఉత్తమ్ పద్మావతి పోటీ చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ నియోజకవర్గాలలో 50వేల మెజార్టీ తగ్గితే తాను పూర్తిగా రాజకీయాలను తప్పుకుంటానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.
తనకు పిల్లలు లేరని, ఈ రెండు నియోజకవర్గాల ప్రజలే తన పిల్లలని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, బిజెపి లు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిజాలను నిర్భయం లేకుండా వార్తలు రాసే జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అలాగే విద్యావ్యవస్థకు తీరని అన్యాయం చేస్తున్నారని, యూనివర్సిటీలో నిర్వీర్యం చేస్తున్నారని, వేలాది అధ్యాపక పోస్టులు పెండింగ్లో ఉంటే ఇప్పటివరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు వెల్లడించాలని, ప్రజలు కూడా కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో అధికార పగ్గాలను చేపడితే నిరుద్యోగ యువతను ఆదుకుంటామని, అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
యువజన సమ్మేళన కార్యాక్రమానికి కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గాల విద్యార్థి, NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేన రెడ్డి పాల్గొన్నారు.
