రిజిస్ట్రేషన్ల మీదే ఉంటే.. విద్యార్ధుల గతేంటి : తహసీల్దార్లకు కిషన్ రెడ్డి సూచనలు
తెలంగాణలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పని విభజన చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే అధికారాలను తహసీల్దార్లకే కాకుండా ఆర్డీవోలకూ అప్పగించాలని ఆయన పేర్కొన్నారు
తెలంగాణలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పని విభజన చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే అధికారాలను తహసీల్దార్లకే కాకుండా ఆర్డీవోలకూ అప్పగించాలని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ నూతన డైరీ, క్యాలెండర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి కిషన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్లు రిజిస్ట్రేషన్లపైనే దృష్టి సారించడంతో విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు రావడానికి ఆలస్యమవుతోందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతినిత్యం రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం టార్గెట్లుపెట్టడంతో తహసీల్దార్లు తమ సమయం మొత్తాన్ని దానికే కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పే ప్రభుత్వం.. అదనపు భారం మోపుతూ తహసీల్దార్లు, వీఆర్వోలను ఇబ్బందులకు గురిచేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని వీఆర్వోలు ఏ శాఖలో ఉన్నారో కూడా తెలియని అమోమయ స్థితి నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదని.. ఉద్యోగులకు పదోన్నతులు నిలిచిపోయాయని కిషన్రెడ్డి విమర్శించారు.