జనానికి అనుమతి లేని ప్రగతి భవన్.. సీఎం రాని సచివాలయం ఎందుకు : కేసీఆర్పై కిషన్ రెడ్డి ఫైర్
ప్రజలకు అనుమతి లేని ప్రగతి భవన్, సీఎం రాని సచివాలయం ఎందుకు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 2016 నుంచి సచివాలయానికి రాకుండానే కేసీఆర్ పాలన చేశారని మండిపడ్డారు.
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం కేసీఆర్పై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజాం రాచరిక ఆలోచనలతో కేసీఆర్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. 2016 నుంచి సచివాలయానికి రాకుండానే కేసీఆర్ పాలన చేశారని.. ప్రజలకు అనుమతి లేని ప్రగతి భవన్, సీఎం రాని సచివాలయం ఎందుకు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
అంతకుముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా సచివాలయ నిర్మాణం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో హిందువుల వాటా రెండు గుంటలేనని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన.. కొత్త సచివాలయంలోకి తాము అడుగుపెట్టమని ఆయన స్పష్టం చేశారు.
Also Read: అన్ని రంగాల్లో దూసుకుపోవడమే తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక: కేసీఆర్
కాగా.. తెలంగాణ నూతన సచివాలయాన్ని ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన కార్యాలయానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ముందుగా నిర్ణయించిన సుముహుర్తానికి కుర్చీలో ఆసీనులైనారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆరు దస్త్రాలపై సుముహుర్తంలోనే సంతకాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ దస్త్రంపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఫైల్స్పై సంతకం చేసిన అనంతరం వేద పండితులు కేసీఆర్కు ఆశీర్వచనాలు అందించారు. ఈ క్రమంలోనే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియాజేశారు.
కేసీఆర్ నూతన సచివాలయంలోని తన ఛాంబర్లో ఆసీనులైన సందర్భంగా యాదాద్రి ఆలయానికి సంబంధించిన కాఫీ టేబుల్ పుస్తకంతో పాటు కవిత నీరాజనం పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గీత యాదాద్రి ప్రసాదాన్ని కేసీఆర్కు అందజేశారు.