మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ తరపున సీనియర్ నాయకులు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన న్యూ ఢిల్లీ పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన హాజరయ్యారు. సమావేశం అనంతరం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలంలో తాము ఢిల్లీలో ఉన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల రాజకీయ పార్టీలు, సంఘాలు మమ్మల్ని కలిసే వారనీ, అక్కడి పరిస్థితులపై తనకు కొంత అవగాహన ఉందనన్నారు.
మణిపూర్ ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు భరోసా, ధైర్యం కల్పించే బాధ్యత ఉందని అఖిలపక్ష సమావేశంలో చెప్పామని అన్నారు.
మణిపూర్ లో కుకి, నాగాలు కొండ ప్రాంతాల్లో నివాసిస్తారనీ, వారే 40% ఉంటారని తెలిపారు. మైదాన ప్రాంతంలో మెయితెయిలు నివసిస్తారనీ, వారి జనాభా దాదాపుగా 50% ఉందనీ, వీళ్ళు హిందువులేనని తెలిపారు. కారణాలు తెలియనప్పటికి 1990 నుంచి ఘర్షణ వాతావరణం నెలకొందనీ, కుకి లు, నాగలు ఉన్న చోట మమ్మల్ని ఎస్టీల్లో చేర్చాలని మెయితెయిలు డిమాండ్ చేస్తున్నారని వివరించారు. ఎవరినైనా ఎస్టీల్లో చేర్చాలంటే ఆ హక్కు పార్లమెంట్ కు మాత్రమే ఉంటుందనీ, కానీ మణిపూర్ హైకోర్టు 4 వారాల్లో మెయితెయిలను ఎస్టీల్లో చేర్చాలని తీర్పు ఇచ్చిందనీ, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడం లేదనీ, ఒకవేళ స్టే ఇచ్చి ఉంటే ఇలాంటి సంఘటనలు జరగపోయేవని అన్నారు.
4వేల ఆయుధాలను మెయితెయిలు ఎత్తుకెళ్లడం జరిగిందనీ, కేంద్ర బలగాలు మోహరించారని చెబుతున్నారనీ, కావున ఆయుధాలను డిస్ ఆర్మ్ చేయాలని తెలిపారు. మణిపూర్ లో ఘర్షణల కారణంగా అనేక ఇళ్ళు ధ్వంసం అయ్యాయనీ, వేలాదిమంది నిర్వాసితులయ్యారని విమర్శించారు. కేంద్రం వెంటనే వారికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. 50 రోజులు ఇంటర్నెట్ నిషేధించడం మంచిది కాదని తాము చెప్పామనీ, విద్యార్థులు, యువత, ఇతర సేవలకు అంతరాయం కలుగుతుందని, వెంటనే ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరణ చేయాలని కోరామని తెలిపారు.
ఇంతటి మరణాహోమం జరుగుతున్న ఇప్పటివరకు ప్రధాని స్పందించలేదనీ, ఇది సరైన వైఖరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 ఏళ్ల క్రితం కాశ్మీర్ లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆనాడు హోంశాఖ మంత్రి చిదంబరం నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగిందనీ, ఆ సమావేశానికి టీ.ఆర్.ఎస్ పార్టీ తరపున తాను హజరయ్యానని గుర్తు చేశారు. ఆనాటి సమావేశానికి హాజరైన అన్ని పార్టీలను క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు తీసుకెళ్లారనీ, తాను కీలక సూచనలు చేశానని తెలిపారు. నేటి సమావేశంలో తాము చేసిన సూచనలు, సలహాలను స్వీకరిస్తామని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
