నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు  పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని  ఉమేష్ సిన్హా కమిటీ కేంద్ర ఎన్నికల సంఘానికి  రిపోర్ట్ ఇచ్చింది

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఉమేష్ సిన్హా కమిటీ కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ ఇచ్చింది. మరో 10 రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ప్రతినిధి బృందం మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది.

తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు తెలంగాణలో పర్యటించారు. త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడ ఎన్నికలను నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలో కమిటీ ఈ రిపోర్ట్ ను ఇచ్చింది.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి శుక్రవారం సాధారణంగా ఎన్నికల ప్రక్రియపై జరిగే సమావేశం ఇవాళ సాయంత్రం గంటన్నర పాటు జరిగింది. 

ఉమేష్ సిన్హా తెలంగాణలో పర్యటించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన రిపోర్ట్ పై సమీక్షపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. 

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించాలా.. లేదా ఈ నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలనే విషయమై చర్చించారు. తెలంగాణలో విపక్షాలు లేవనెత్తిన అంశాలపై కూడ ఉమేష్ సిన్హా కమిటీ తోసిపుచ్చింది. అయితే ఓటర్ల జాబితాలో అవకతవకలు తదితర విషయాలపై కొన్ని పార్టీలు చేస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. 

అన్నీ సక్రమంగా జరిగితే అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు మరోసారి తెలంగాణలో పర్యటించిన తర్వాత షెడ్యూల్ గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.