తెలంగాణ జగిత్యాల జిల్లాలో (jagtial district) ఎస్సారెస్పీ కాకతీయ కాలువలోకి (Kakatiya Canal) కారు దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాకతీయ కాలువలోకి దూసుకెళ్లిన కారును పోలీసలు బుధవారం ఉదయం క్రేన్ సాయంతో వెలికితీశారు. ఆ కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
తెలంగాణ జగిత్యాల జిల్లాలో (jagtial district) ఎస్సారెస్పీ కాకతీయ కాలువలోకి (Kakatiya Canal) కారు దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాకతీయ కాలువలోకి దూసుకెళ్లిన కారును పోలీసలు బుధవారం ఉదయం క్రేన్ సాయంతో వెలికితీశారు. ఆ కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాలు.. జిల్లాలోని మెట్పల్లికి చెందిన గుండవేని ప్రసాద్, పుదరి రేవంత్లు.. తమ ఊరి నుంచి సమీపంలోని ఆత్మకూరుకు సోమవారం రాత్రి బయలుదేరారు. అయితే మరసటి రోజు ఉదయం అయిన కూడా వారు ఆత్మకూరు చేరుకోలేదు. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి మెట్పల్లి నుంచి వెల్లుల్ల మార్గంలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఆ మార్గంలో అందుబాటులో సీసీ టీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆ మార్గంలో వెల్లుల్ల శివారులోని కాకతీయ కాలువ ఉన్న వంతెన రెయిలింగ్ కూలిపోయి ఉండటం గురించి పోలీసులకు సమాచారం అందింది. ఈ వంతెనపై నుంచే మెట్పల్లి నుంచి ఆత్మకూరు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు కారు రెయిలింగ్ను ఢీకొని కాకతీయ కాల్వలోకి దూసుకెళ్లి ఉంటుందని అనుమానించారు.
ఈ క్రమంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాలువకు నీటి విడుదలను ఆపించారు. ఈరోజు తెల్లవారే సరికి కాకతీయ కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టగా.. కారును గుర్తించారు. మూడు గంటలపాటు శ్రమించిన గజఈతగాళ్లు, పోలీసులు.. ఎట్టకేలకు ఇద్దరి మృతదేహాలు, కారును వెలికితీశారు. కారును బయటకు తీసేందుకు పోలీసులు క్రేన్ను వినియోగించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్సారెస్పీ కాల్వలో కారు పడిన విషయం తెలుసుకున్న వెల్లుల్ల సమీప గ్రామాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకన్నారు. ఇక, ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
