హైదరాబాద్: డీజీపీ కోసం ట్రాఫిక్ను నిలిపివేత, ఇరుక్కుపోయిన అంబులెన్స్లు.. వివాదం
డీజీపీ రాక కోసం మాసబ్ట్యాంక్ ప్రాంతంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని మాసబ్ట్యాంక్లో డీజీపీ వస్తుండటంతో ప్రొటోకాల్ ప్రకారం శనివారం సాయంత్రం ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నిలిపివేశారు. దీంతో అత్యవసర రోగులున్న రెండు అంబులెన్స్లు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. అదే సమయంలో అంబులెన్స్లో ఉన్న వైద్య సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్లారు.
ఈ ఘటనపై పెద్ద దుమారం రేపడంతో హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ఘటనపై ఆయన ఆరా తీశారు. మరోవైపు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సైతం దీనిపై వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.