గతంలో బహిరంగంగానే తండ్రితో వాదనకు దిగిన జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జాభవానీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి తన కూతురు తుల్జాభవానీరెడ్డి మరోసారి షాకిచ్చింది. గతంలో బహిరంగంగానే తండ్రితో వాదనకు దిగిన ఆయన కూతురు తుల్జాభవానీరెడ్డి... తాజాగా తన తన తండ్రి మంచోడు కాదంటూ.. ఆయన అవినీతిపరుడని, అసలు ప్రజలు ఆయనను ఎందుకు ఎన్నుకున్నారో తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయనను ప్రశ్నించాల్సింది.. ఓడించాల్సింది ప్రజలేనని అన్నారు. ప్రజల ఆస్తిని తాను ప్రజలకే తిరిగి ఇచ్చేశానని చెప్పారు. తన తండ్రి నుండి రూపాయి కూడా తీసుకోలేదనీ, కుటుంబం నుండి తనకు ఎలాంటి మద్దతు లేదన్నారు.

మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. తాను తన తండ్రిపై భూకబ్జా చేసినట్లు బహిరంగంగా ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తన తండ్రి లాంటి అవినీతిపరులకు పార్టీ టిక్కెట్ ఇవ్వకూడదని, తన తండ్రి సొంతంగా పోటీ చేస్తే.. సర్పంచ్‌గా కూడా గెలవలేడనీ, ఎన్నికల్లోకేసీఆర్ పేరు చెప్పుకొని ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. 

తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని, తనకు ఏ పార్టీ చేయడం లేదని అన్నారు. కబ్జా చేసిన తన తండ్రిని వదిలేసి, తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామకు వెళ్లి అడిగితే తన తండ్రి గురించి ప్రతి ఒక్కరు చెబుతారన్నారు. ఇప్పుడిప్పుడే తన తండ్రి బాధితులు ఫోన్ చేస్తున్నారని, బయటకొస్తున్నారని తుల్జాభవానీరెడ్డి చెప్పారు.