గుడ్ న్యూస్.. ఆ మార్కుల కలిపేందుకు ఒకే.. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలపై కీలక నిర్ణయం..
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలపై పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలపై పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో బహుళ సమాధానాలతో కూడిన ప్రశ్నలకు సంబంధించి అందరికీ మార్కులు కలపాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రశ్నలకు మార్కులు కలిపిన తర్వాత ప్రిలిమనరీ పరీక్షలో అదనంగా ఉత్తీర్ణత సాధించేవారికి.. ఫిజికల్ టెస్ట్లు నిర్వహించనున్నట్టుగా ప్రకటించింది. అదనంగా అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను జనవరి 30 నుంచి www.tslprb.in వెబ్సైబ్లో అందుబాటులో ఉంచనున్నట్టుగా పేర్కొంది.
ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు.. ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు పార్ట్-2 అప్లికేషన్ సబ్మిట్ చేయాలని తెలిపింది. వారికి ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని పేర్కొంది. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, ఆదిలాబాద్లలో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్టుగా తెలిపింది. పది రోజుల్లో ఫిజికల్ టెస్ట్ల ప్రక్రియను పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక, ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ల రాత పరీక్షకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) అమలు చేయాలని పలు ప్రతిపక్ష పార్టీలు గత కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు మార్కులు కలిపేందుకు పోలీసు రిక్రూట్మెంట్ అంగీకరించడంతో.. ఆ జాబితాలో చోటుదక్కించుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పినట్టు అయింది.