కేసీఆర్ను కలిసిన టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులు.. బీఫాంలను అందజేసిన సీఎం
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా వారికి బీ ఫారాలను అందజేశారు ముఖ్యమంత్రి. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, గాయత్రి రవిలను కేసీఆర్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
త్వరలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు అనంతరం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్ధులను ఖరారు చేశారు. ఇద్దరు ఓసీ, ఒక బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, గాయత్రి రవిలను కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్లో వీరు ముగ్గురు సీఎంను కలిశారు. అనంతరం వారికి ముఖ్యమంత్రి బీ ఫారాలను అందజేశారు.
కాగా.. Andhra Pradesh, Telangana సహా 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు గత గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 10న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో రెండు Rajaya Sabha స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, వైఎస్ చౌదరి (సుజనా చౌదరి), విజయసాయి రెడ్డిలు ఈ ఏడాది జూన్ 21న రిటైర్ కానున్నారు. తెలంగాణ నుండి డి.శ్రీనివాస్ (డీఎస్), వొడితెల లక్ష్మీకాంతరావులు రిటైర్ అవుతారు.
ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు మే 31 వరకు గడువు విధించారు. జూన్ 1న నామినేషన్లను పరిశీలించనున్నారు. జూన్ 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 10న రాజ్యసభ ఎన్నికలను జరిపి, అదే రోజున కౌంటింగ్ నిర్వహిస్తారు.