మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయడంతో నీ పలుకుబడి ఇంకా పెరిగిందని ఎంపీ, మాజీ మంత్రి డి. శ్రీనివాస్  మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో అన్నారు. 

హైదరాబాద్: మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయడంతో నీ పలుకుబడి ఇంకా పెరిగిందని ఎంపీ, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో అన్నారు.బుధవారం నాడు డిఎస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుమారు రెండు గంటల పాటు ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సందర్భంగా తనకు జరిగిన అన్యాయాన్ని ఈటల రాజేందర్ డి.శ్రీనివాస్ తో చర్చించారు. అధికార టీఆర్‌ఎస్‌ సొంత మీడియాలో భూ కబ్జా కథనాలు రావడం, సీఎం కేసీఆర్‌ వేగంగా స్పందించడమే కాకుండా.. కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయడం వల్ల నీ పలుకుబడి బాగా పెరిగిందన్నారు. ఈ విషయమై తన మద్దతు ఉంటుందని డిఎస్ ఈటల రాజేందర్ కు తెలిపారు. తెలంగాణ ప్రాంత చరిత్రలోనే ఇప్పటివరకు ఈ స్థాయి గొప్ప సానుభూతి ఇతరులెవరికీ రాలేదని డిఎస్ ఈటలతో అన్నారని సమాచారం. పెరిగిన పలుకుబడి, వ్యక్తమైన సానుభూతిని నిలుపుకోవాలన్నారు. అక్కడే విజ్ఞత ప్రదర్శించాలని డిఎస్ సూచించారు. 

also read:బీజేపీ అండ కావాలి: మాజీ మంత్రి చంద్రశేఖర్‌తో ఈటల భేటీ

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది కలుస్తుంటారు. కొందరు నిజంగానే అనుకూలంగా ఉంటారు. మరికొందరు అనుకూలంగా ఉన్నట్లు నటిస్తారు. ఇంకొందరు రెచ్చగొడతారు. జాగ్రత్తగా ఉండాలని ఈటలకు డీఎస్‌ ఉద్భోదించారు. ఈ సమయంలో తొందరపడకూడదని,చాలా సహనం అవసరమని డిఎస్ సూచించారు.ఈటలపై రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న దాడి అత్యంత నీచమైనదిగా డిఎస్ అభిప్రాయపడ్డారు.

బీజేపీ నేతలు ఎ.చంద్రశేఖర్‌, జితేందర్‌రెడ్డితోనూ భేటీ..

బీజేపీ నేతలు ఎ.చంద్రశేఖర్‌, జితేందర్‌రెడ్డితోనూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్కతో ఈటల మంగళవారం భేటీ అయిన విషయం తెలిసిందే. అదే రోజు బీజేపీ నేతలు చంద్రశేఖర్‌, జితేందర్‌రెడ్డిని కలిశారు. ఆయన ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అదే పార్టీకి చెందిన కె.స్వామిగౌడ్‌ను కూడా కలిశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ఫోన్‌లో ఈటలతో మాట్లాడి తమ సానుభూతి తెలిపారు. 

అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, రాజకీయ పరిచయాలతోనే ఈటల రాజేందర్‌ వివిధ పార్టీలకు చెందిన నేతలను కలుస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదివరకు మంత్రిగా బిజీ షెడ్యూల్‌ ఉండటం వల్ల ఎవరినీ కలవడం సాధ్యం కాలేదని చెబుతున్నారు. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా ఉండటం వల్ల తగినంత సమయం దొరకటంతో అందరినీ మర్యాదపూర్వకంగా కలుస్తున్నారని వారు వివరిస్తున్నారు. వారంతా రాజకీయాలు, సిద్ధాంతాలకు అతీతంగా ఈటలకు నైతికంగా మద్దతిస్తున్నారని తెలిపారు.