రాజీనామా చేస్తా, బండి సంజయ్ చేస్తారా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్
తనపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పందించారు. ఆరోపణలు నిజమని తేలితే తాను రాజీనామా చేస్తానని, సంజయ్ ఎంపీ పదవికి రాజీనాామా చేస్తారా అని సవాల్ విసిరారు.
హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లాలోని గుర్రంపోడు భూవివాదంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలపై టీఆర్ఎస్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి తీవ్రంగా స్పందించారు. గుర్రంపోడు భూముల వివాదం విషయంలో బిజెపి ఆదివారంనాడు గిరిజన భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డిపై బండి సంజయ్ ఆరోపణలు చేశారు.
తనపై ఆరోపణలు రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తనపై ఆరోపణలు అవాస్తవమని తేలితే బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని సైదిరెడ్డి సవాల్ విసిరారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో లబ్ధి పొందడానికి బండి సంజయ్, కాంగ్రెసు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు
బిజెపి చేపట్టిన గిరిజన భరోసా యాత్ర ఓ వంచన అని సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. గిరిజన భరోసా యాత్రలో స్థానికులు ఎవరూ లేరని, అందరూ హైదరాబాదు నుంచి వచ్చినవారే ఉన్నారని ఆయన అన్నారు. 2014 నుంచి దొంగ పట్టాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు దొంగ పట్టాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఆదివారం చేపట్టిన గిరిజన భరోసా యాత్రలో బండి సంజయ్ తో పాటు సినీ నటి విజయశాంతి కూడా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విజయశాంతి తీవ్రమైన విమర్శలు చేశారు.