ఏసీబీ దాడులు.. భయంతో రూ.5 లక్షల్ని కాల్చేసిన టీఆర్ఎస్ నేత
నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తిలో టీఆర్ఎస్ నేత రూ. 5 లక్షల రూపాయల నగదును తగులబెట్టారు. వివరాల్లోకి వెళితే.. వెల్దండలో క్రషర్ ఏర్పాటుకు తహసీల్దార్ సైదులు ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు
నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తిలో టీఆర్ఎస్ నేత రూ. 5 లక్షల రూపాయల నగదును తగులబెట్టారు. వివరాల్లోకి వెళితే.. వెల్దండలో క్రషర్ ఏర్పాటుకు తహసీల్దార్ సైదులు ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. వాటిని మధ్యవర్తిగా ఉన్న మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్కు ఇవ్వాలని సదరు వ్యక్తికి తహసీల్దార్ సూచించారు.
దీనిలో భాగంగా టీఆర్ఎస్ నేత వెంకటయ్య గౌడ్ రూ. 5 లక్షలు లంచం తీసుకున్నాడు. బాధితుడు నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
వారిని చూసి భయపడిన వెంకటయ్య 5 లక్షల రూపాయలను గ్యాస్ స్టవ్ మీద తగులబెట్టారు. అనంతరం తహసీల్దార్ సైదులు, వెంకటయ్యగౌడ్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. హైదరాబాద్ ఎల్బీనగర్లో సైదులు ఇంట్లో సోదాలు నిర్వహించారు.
కల్వకుర్తి, జిల్లెలగూడ, వెల్దండ చెదురుపల్లిలోని వెంకటయ్య గౌడ్ ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కాగా , కొద్దిరోజుల క్రితం రాజస్థాన్లో ఓ తహసీల్దార్ సైతం ఏసీబీ అధికారులకు భయపడి రూ.20 లక్షల నగదును గ్యాస్ స్టవ్పై పెట్టి కాల్చేసిన ఘటన కలకలం రేపుతోంది.