ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు స్థానాలకు టీఆర్ఎస్ శుక్రవారం నాడు అభ్యర్థులను ప్రకటించింది. మరో స్థానాన్ని తన మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది.
హైదరాబాద్: ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు స్థానాలకు టీఆర్ఎస్ శుక్రవారం నాడు అభ్యర్థులను ప్రకటించింది. మరో స్థానాన్ని తన మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. ప్రస్తుత హోం మంత్రి మహమూద్ అలీకి ఎమ్మెల్సీ జాబితాలో చోటు దక్కింది.
ఈ ఏడాది మార్చి 29వ తేదీతో మహమూద్ అలీ టర్మ్ పూర్తి కానుంది. దీంతో ఎమ్మెల్సీగా ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు కేసీఆర్. బీసీ సామాజిక వర్గం నుండి ఎగ్గే మల్లేశంకు కేసీఆర్ ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు.
మరో వైపు శేరి సుభాష్ రెడ్డికి కూడ ఎమ్మెల్సీ సీటు కల్పించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా మహబూబాబాద్ నుండి విజయం సాధించిన సత్యవతి రాథోడ్కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. 2014 ఎన్నికలకు ముందు ఆమె టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. మరో స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. ఈ ఐదు స్థానాలకు ఈ ఏడాది మార్చి 12 తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
