కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్. కానీ ఇవాళ కోమటిరెడ్డి క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. కోమటిరెడ్డికి ఎన్నో పదవులు వచ్చాయని... అప్పుడు కూడా డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్. కానీ ఇవాళ కోమటిరెడ్డి క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. కోమటిరెడ్డికి ఎన్నో పదవులు వచ్చాయని... అప్పుడు కూడా డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు రాలేదని నిందలు వేయడం సరికాదని మహేశ్ గౌడ్ హితవు పలికారు. కోమటిరెడ్డి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని మహేశ్ గౌడ్ హెచ్చరించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన అన్నారు. 

కాగా, ఆదివారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయిందంటూ ఫైర్ అయ్యారు. ఇకపై తాను గాంధీ భవన్ మెట్లెక్కనని శపథం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవొద్దని కోమటిరెడ్డి సూచించారు. తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలే నిర్ణయిస్తారని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై తాను తన నియోజకవర్గం, జిల్లాకే పరిమితమవుతానని కోమటిరెడ్డి వెల్లడించారు.

Also Read:అది టీపీసీసీ కాదు.. టీడీపీపీసీసీ, ఇకపై గాంధీభవన్ మెట్లెక్కను: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సోనియా, రాహుల్ గాంధీలపై విమర్శలు చేయనని ఆయన స్పష్టం చేశారు. పీసీసీని ఇన్‌ఛార్జి అమ్ముకున్నారని.. త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ సామాన్య కార్యకర్తకు వస్తుందని అనుకున్నానన్నారు కోమటిరెడ్డి. తాను కార్యకర్త నుంచి వచ్చిన వాణ్ణి అని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో కార్యకర్తలకు న్యాయం జరగదని కేడర్‌కి చెప్పినట్లయ్యిందని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.