నేడు దేవేందర్గౌడ్ ఇంటికి రేవంత్ రెడ్డి: వీరేందర్కు కాంగ్రెస్ గాలం
టీడీపీలో కీలకంగా వ్యవహరించిన దేవేందర్ గౌడ్ ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సాయంత్రం వెళ్లనున్నారు. దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ ను కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించనున్నారు.ఇప్పటికే గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన నేతలు కొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు.
హైదరాబాద్: టీడీపీలో గతంలో కీలకంగా పనిచేసిన నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు టీడీపీలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం బీజేపీలో చేరిన వీరేందర్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి దేవేందర్ గౌడ్ ఇంటికి ఆదివారం నాడు వెళ్లనున్నారు.
టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన తన పూర్వ సహచరులను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. ఇటీవలనే ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణరావులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు నేతలు కూడ కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన దేవేందర్ గౌడ్ రాజకీయాలకు కొంత కాలంగా దూరంగా ఉన్నారు. ఆయన తనయుడు వీరేందర్ గౌడ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. గతంలోనే ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరారు. వీరేందర్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం దేవేందర్ గౌడ్ నివాసానికి చేరుకొంటారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.