Asianet News TeluguAsianet News Telugu

ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రాదు.. సీఎస్ పోస్ట్ ఇచ్చారు : సోమేశ్ కుమార్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలుత సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు చేసిన ఆయన.. ఆ వెంటనే సీఎస్ సోమేశ్ కుమార్‌పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

tpcc chief revanth reddy sensational comments on telangana chief secretary somesh kumar ksp
Author
Hyderabad, First Published Jul 17, 2021, 5:38 PM IST

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోమేశ్ కుమార్‌పై 294 కోర్టు ధిక్కార నోటీసులు వున్నాయని తెలిపారు. ఐఏఎస్ ఉద్యోగం మానేసి, ప్రైవేట్ కంపెనీలో 8 ఏళ్లు ఆయన ఉద్యోగం చేశారని రేవంత్ ఆరోపించారు. ఎనిమిదేళ్లు సర్వీస్ తీసేస్తే.. ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉద్యోగం కూడా రాదంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అలాంటి వారిని సీఎస్‌గా నియమించారంటూ టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. కోర్టులో సీఎస్ సోమేశ్ కుమార్ ఫైల్ మిస్ అయ్యిందని సమాచారం వుందని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అన్ని శాఖల బాధ్యతలను సోమేశ్‌కే ఇస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. రెరా ఛైర్మన్, సీసీఎల్ఏ, జీఎస్టీ కమీషనర్ ఇలా కీలక బాధ్యతలన్నీ సోమేశ్ కుమార్ వద్దే వున్నాయంటూ రేవంత్ వెల్లడించారు. 

ALso REad:‘‘ రాజ్‌పుష్ప ’’ పేరుతో ఆ కలెక్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం.. అన్ని బయటపెడతాం: రేవంత్ రెడ్డి ఆరోపణలు

అంతకుముందు సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపైనా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై గతంలో సీబీఐ విచారణ నివేదిక వుందని దానిని బయటపెడతామన్నారు. వెంకట్రామిరెడ్డి రాజ్‌పుష్ప పేరుతో ఎన్ని వెంచర్లు వేశారు.. ఏం చేశారనేది బయటపెడతామని రేవంత్ స్పష్టం చేశారు. టెండర్లు రద్దు చేసి.. స్విస్ ఛాలెంజ్ విధానంలో భూములు విక్రయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

వెంకట్రామిరెడ్డి ఎవరో కాదని.. కేసీఆర్ కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేసిన కలెక్టర్ అని రేవంత్ గుర్తుచేశారు. ఆయన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బంధువని తెలిపారు. బడా కంపెనీలు రావొద్దని సిద్దిపేట కలెక్టర్  బెదిరించారని రేవంత్ ఆరోపించారు. ప్రెస్టేజ్ వాళ్లకు ఏడున్నర ఎకరాల భూమిని ఇచ్చారని ఆయన చెప్పారు. కేటీఆర్‌కు ప్రెస్టేజ్ కంపెనీతో సంబంధాలు వున్నాయని రేవంత్ ఆరోపించారు. వర్సిటీ కంపెనీ శ్రీచైతన్య వాళ్లదని.. ఉద్యమం సమయంలో చైతన్య కాలేజీలను నానా తిట్లు తిట్టారని రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్ దగ్గరి వాళ్లకే భూములు అమ్మకానికి పెట్టారంటూ ఆయన ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios