రామేశ్వరరావు సంస్థలకు కారు చౌకగా భూములు: కోకాపేట భూముల వేలంపై రేవంత్ రెడ్డి సంచలనం
కోకాపేట భూముల వేలంపై రామేశ్వరరావుతో పాటు కొందరు కేసీఆర్, కేటీఆర్ కి చెందిన సన్నిహితులు, బంధువులకు ఈ భూములు వేలంలో దక్కాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.
హైదరాబాద్:కోకాపేట భూముల వేలం పాటలో పెద్ద ఎత్తున కుంభకోణం చోటు చేసుకొందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.రామేశ్వరరావు కుటుంబానికి చెందిన కంపెనీలకు తక్కువకే భూములు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. 2018లోనే కోకాపేటలో 164 ఎకరాల భూమిని బందువులకు కేసీఆర్ అమ్మకానికి పెట్టారన్నారు. కేసీఆర్ కాళ్లకు సాష్టాంగ దండం పెట్టడం వెనుక పెద్ద భూ కుంభకోణం ఉందని ఆయన చెప్పారు. కలెక్టర్ వెంకట్రాం రెడ్డి కంపెనీలకు అతి తక్కువ ధరకే భూములను కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.
రూ. 30 కోట్లకే ఎకరా భూమిని విక్రయించడం దారుణమన్నారు. తన అనుయాయులు, బంధువులు, స్నేహితులకు కారుచౌకగా ఈ భూములను కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.కోకాపేట, మంచిరేవుల, నార్సింగి ప్రాంతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీ భూములను కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. కోకాపేటలోని 50 ఎకరాల భూమిలో ప్రభుత్వానికి రూ. 3 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ. 2 వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
also read:‘‘ రాజ్పుష్ప ’’ పేరుతో ఆ కలెక్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం.. అన్ని బయటపెడతాం: రేవంత్ రెడ్డి ఆరోపణలు
ఈ భూముల వేలం విషయమై అధికారులు కానీ, ప్రభుత్వం నుండి కానీ ఎవరూ కూడ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు చెంది ఇద్దరు ఎమ్మెల్సీలు తనను తిట్టడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నారు. కానీ తాను లేవనెత్తిన అంశాలపై నోరు మెదపలేదని ఆయన చెప్పారు. పార్లమెంట్ సమావేశాలకు తాను వెళ్లకుండా అడ్డుకొన్నారని ఆయన మండిపడ్డారు.ఈ విషయమై స్పీకర్ కు కూడ లేఖ రాసినట్టుగా చెప్పారు.