ఓఆర్ఆర్లో కేటీఆర్ అక్రమాలు.. బీజేపీ మౌనం వెనుక , మేం వదిలిపెట్టం : రేవంత్ రెడ్డి
ఔటర్ రింగ్ రోడ్డును కేటీఆర్ ప్రైవేట్కు కట్టబెట్టారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అన్నీ తెలిసినా బీజేపీ ఎందుకు మౌనంగా వుంటోందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక దీనిపై విచారణ చేయిస్తామన్నారు.
![tpcc chief revanth reddy fires on minister ktr ksp tpcc chief revanth reddy fires on minister ktr ksp](https://static-ai.asianetnews.com/images/01gjchgf2med2m7vjqwz25t0z4/revanth-reddy-jpg_363x203xt.jpg)
కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహానగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించిందన్నారు. ఇందుకోసం రూ.6696 కోట్లను గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని రేవంత్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డును కేటీఆర్ ప్రైవేట్కు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ జరిపిస్తామని.. ఇలాంటి నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా వుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇకపోతే.. నిన్న నల్గొండలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తన బిడ్డను బిర్లాగా.. అల్లుణ్ణి అంబానీగా.. కొడుకును టాటాగా మార్చారని సెటైర్లు వేశారు. తెలంగాణలో ప్రశ్నాపత్రాలు బజార్లో దొరుకుతున్నాయని.. లక్షలాది మంది బిడ్డల జీవితాలను అంధకారంలోకి నెట్టి ప్రశ్నాపత్రాలను వందలకోట్లకు కేసీఆర్ కుటుంబం అమ్ముకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్ధితి లేదని దుయ్యబట్టారు.
రావినారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, పాల్వాయి గోవర్థన్ రెడ్డి, ఆరుట్ల కమలాదేవీ, చకిలం శ్రీనివాసరావు వంటి నాయకలు నల్గొండ జిల్లాకు చెందినవారేనని రేవంత్ గుర్తుచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తన పదవులకు రాజీనామా చేశారని.. మలి ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పదవులకు రాజీనామా చేశారని రేవంత్ గుర్తుచేశారు. ఎంతోమంది దిగ్గజ నేతలున్న ఈ జిల్లాలో దొరగారి సారాలో సోడా పోసేవారు ఈ జిల్లా నుంచి మంత్రి అయ్యాడని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి నేతలు అవసరమా అని నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.