అలా అయితే రాజీనామా చేస్తా, చర్చకు సిద్దమా?: మూడు చింతలపల్లిలో దళిత గిరిజన దీక్షలో రేవంత్
దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడు చింతలపల్లిలో దీక్షకు పూనుకొన్నారు. ఈ దీక్షలో దత్తత గ్రామాల గురించి రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ దత్తత గ్రామాల్లో చేసిన అభివృద్ది గురించి చెబితే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు.
హైదరాబాద్: కేసీఆర్ దత్తత తీసుకొన్న గ్రామాల్లో అభివృద్దిపై తాను చర్చకు సిద్దంగా ఉన్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. దత్తత గ్రామాలకు ఏం ఇచ్చారో కేసీఆర్ చెబితే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు.
కేసీఆర్ దత్తత తీసుకొన్న మూడు చింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత గిరిజన దీక్షను మంగళవారం నాడు ప్రారంభించారు. 48 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగిస్తారు. ప్రజలను మభ్య పెట్టేందుకే కేసీఆర్ దత్తత గ్రామం పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎంతమందికి ఇళ్లు ఇచ్చారో , ఎందరికి పెన్షన్ ఇచ్చారో ఇంటింటికి వెళ్లి సర్వే చేద్దామా అని ఆయన టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
మూడు చింతలపల్లి, కేశవాపూర్, లక్ష్మాపూర్ గ్రామాలను సీఎం కేసీఆర్ దత్తత తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.2015 ఆగష్టు 8వ తేదీన చిన్నముల్కనూరు గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకొన్నారన్నారు. కానీ ఇంతవరకు దత్తత తీసుకొన్న గ్రామంలో 150 కుటుంబాలు కూడ ఇంకా రోడ్డుపైనే జీవనం సాగిస్తున్నాయని ఆయన చెప్పారు. ధరణి వెబ్సైట్ లో కేసీఆర్ దత్తత గ్రామం లక్ష్మాపూ్ర లేనేలేదన్నారు.
దత్తత గ్రామాల్లో అభివృద్దిపై తాను చర్చకు సిద్దమేనని ఆయన చెప్పారు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు కేసీఆర్ ఇంటి నుండి బయటకు వచ్చాడన్నారు. తన దీక్షకు పోటీగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ పల్లెలు కనిపించని కుట్రల్లో కన్నీరు పెడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు బానిసల కంటే హీనంగా బతుకుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగా ఇస్తే కేసీఆర్ ప్రతి ఒక్కరిపై రూ. 1 అప్పు చేశాడని రేవంత్ విమర్శించాడు.