సారాంశం

టాలీవుడ్ సినీ నటుడు  నవదీప్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు.  డ్రగ్స్ కేసుకు సంబంధించి నవదీప్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు.

హైదరాబాద్:సినీ నటుడు నవదీప్  మంగళవారంనాడు ఈడీ విచారణకు  హాజరయ్యారు.  డ్రగ్స్ కేసులో  నైజీరియన్లతో  సినీ హీరో నవదీప్‌నకు ఉన్న సంబంధాలపై  ఈడీ అధికారులు విచారించనున్నారు.తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు  హీరో నవదీప్ ను  ఇటీవల విచారించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను  యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విచారించిన తర్వాత విచారణకు రావాలని ఈడీ అధికారులు నవదీప్‌నకు నోటీసులు జారీ చేశారు. 

డ్రగ్ పెడ్లర్ గా ఉన్న నైజీరియన్లతో నటుడు నవదీప్‌నకు సంబంధాలున్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పాటు  ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసు విషయమై ఈడీ అధికారులు  నవదీప్ ను విచారించే అవకాశం ఉందని సమాచారం.2017 డ్రగ్స్ కేసులో  మనీలాండరింగ్ జరిగిందని  ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో  గతంలోనే నవదీప్, రకుల్ ప్రీత్ సింగ్,దగ్గుబాటి రానా,రవితేజ,ఛార్మికౌర్, ముమైత్ ఖాన్,తనీష్, నందు,తరుణ్ లను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.మాదాపూర్ డ్రగ్స్ కేసులో  అరెస్టైన రాంచందర్ తో తనకు పరిచయం ఉన్న విషయాన్ని  నవదీప్ అంగీకరించారు.అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదని నవదీప్ పేర్కొన్నారు.మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరును ఏ 29 గా  పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. 

also read:సినీ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం!

ఈ ఏడాది ఆగస్టు 31న మాదాపూర్‌లోని ఓ అపార్ట్ మెంట్ పై పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించారు.  ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన రాంచందర్ తో నవదీప్‌నకు సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19న నవదీప్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14న బెంగుళూరులో అరెస్టైన  డ్రగ్ పెడ్లర్‌తో నవదీప్ నకు పరిచయం ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో  నవదీప్ నకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు. ఇవాళ ఉదయం  ఈడీ కార్యాలయానికి  నవదీప్ చేరుకున్నారు.