బలితీసుకున్న ఈత సరదా... మానేరువాగులో మునిగి ముగ్గురు మృతి
మానేరు వాగులో పడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
మానేరు వాగులో పడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలోని మానేటి రంగనాయక స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు ఓ కుటుంబం వచ్చింది. ఈ క్రమంలోనే ఆలయం పక్కనే వున్న మానేరు వాగులోకి సరదాగా ఈతకు దిగారు చిన్నారులు. ఈ క్రమంలో నీటిప్రవాహం ఎక్కువగా వుండటంతో స్నానానికి దిగినవారు కొట్టుకుపోగా వారిని కాపాడేందుకు మిగతా కుటుంబ సభ్యులు కూడా దిగారు. ఇలా మొత్తం 5గురు వాగులోకి దిగగా ముగ్గురు గల్లంతు అయ్యారు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే వాగులోకి దిగి ఇద్దరిని కాపాడారు. గల్లంతు అయిన ముగ్గురు జోగుల మనోజ్(30) పెంట రాహుల్(20 )జోగుల ఆశిష్(10), మృతి చెందారు. మృతులు సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.