తెలంగాణలోకి నో ఎంట్రీ: పుల్లూరు చెక్పోస్టు వద్ద బీజేపీ ఆందోళన, ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో కర్నూల్ జిల్లాలోని పుల్లూరు వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. అంబులెన్స్లను తెలంగాణలోకి అనుమతించాలని కోరుతూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి
కర్నూల్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో కర్నూల్ జిల్లాలోని పుల్లూరు వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. అంబులెన్స్లను తెలంగాణలోకి అనుమతించాలని కోరుతూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. గురువారం నాడు రాత్రి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో బెడ్ కన్మర్మేషన్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. కొత్త రకం మార్గదర్శకాల మేరకు అనుమతి లేని వాహానాలు, రోగులను సరిహద్దుల్లోనే నిలిపివేస్తున్నారు తెలంగాణ పోలీసులు.
తెలంగాణలోకి అనుమతి నిరాకరించడంతో పుల్లూరు చెక్ పోస్టులో అంబులెన్స్ లోనే ఇద్దరు రోగులు మరణించారు. తెలంగాణలోకి అంబులెన్స్లు, రోగులను అనుమతించాలని కోరుతూ పుల్లూరు చెక్పోస్టు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
also read:తెలంగాణ సరిహద్దులోనే అంబులెన్స్ల నిలిపివేత: కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలో వైద్యం కోసం వచ్చేవారి కోసం ప్రత్యేకమైన కాల్ సెంటర్ ను, ప్రత్యేక పాస్ ల జారీ కోసం తెలంగాణ సర్కార్ గైడ్లైన్స్ జారీ చేసింది. వీటిని పాటించిన వారికే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. అయితే కనీసం మానవతా థృక్పథంతోనైనా ఏపీ రోగులను తెలంగాణలోకి అనుమతివ్వాలని పలు రాజకీయ పార్టీల నేతలు కోరుతున్నారు.