మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొమ్మన రాజన్న ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకొన్నారు. ఆప్థనిస్తాన్ నుండి విమానాలు లేనందున ఆయన స్వదేశానికి రావడానికి ఇబ్బందిపడుతున్నారు. కాబూల్లోని ఏసీసీఎల్ కంపెనీలో రాజన్న పనిచేస్తున్నాడు.
మంచిర్యాల: ఆఫ్ఘనిస్తాన్ లో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొమ్మన రాజన్న చిక్కుకొన్నారు.ఆయనను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు వశం చేసుకొన్నాయి. ఈ తరుణంలో రాజన్న కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఏసీసీఎల్ సంస్థలో రాజన్న పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జూన్ 28న ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుండి సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 7వ తేదీనే అక్కడికి వెళ్లాడు. అతను ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన తర్వాతే ఆ దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కాబూల్ సహా కీలకమైన పట్టణాలతో పాటు పలు రాష్ట్రాల్లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకొన్నారు.
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకొన్న విషయం తెలుసుకొన్న వెంటనే ఇండియాకు వచ్చేందుకు రాజన్నతో పాటు కరీంనగర్ జిల్లా ఒడ్డారానికి చెందిన వెంకన్నకు ఏసీసీఎల్ కంపెనీ విమాన టికెట్లను సిద్దం చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకొన్న పరిస్థితుల నేపథ్యంలో విమానాలు నిలిపివేశారు.
రోడ్డు మార్గాలన్నీ తాలిబన్ల స్వాధీనంలోనే ఉన్నాయి. దీంతో బయటకు వచ్చే మార్గం లేదని రాజన్న కుటుంబసభ్యలకు ఫోన్ చేసి చెప్పారు. రాజన్నను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కేంద్రాన్ని కోరుతున్నారు.
