Telangana: టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి భవన్ లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రెండు రోజులపాటు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఓటర్లు అసంతృప్తిగా ఉన్న 20-25 శాతం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కొత్త ముఖాలను రంగంలోకి దించాలని పీకే సూచించినట్లు సమాచారం.
Telangana Assembly election: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ దూకుడు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ సైతం అంతర్గత కలహాలను పక్కన పెట్టి ఐక్య పోరాటానికి సిద్ధమవుతోంది. వరుసగా రెండో సారి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రముఖంగా పెరుగాంచిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపింది. ఆయన తన బృందం చేసిన ప్రాథమిక సర్వే ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకపోవచ్చునని తెలుస్తోంది.
టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి భవన్ లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు రోజులపాటు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఓటర్లు అసంతృప్తిగా ఉన్న 20-25 శాతం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కొత్త ముఖాలను రంగంలోకి దించాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం. శని, ఆదివారాల్లో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో తన బృందం చేసిన ప్రాథమిక సర్వే ఆధారంగా ప్రశాంత్ కిషోర్ కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. ఆయన టీమ్ తొలుత 30 నియోజకవర్గాల్లో సర్వే చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో జరిగిన సర్వే ఫలితాలను కేసీఆర్తో సమావేశంలో ప్రశాంత్ కిషోర్ పంచుకున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ తో జరుగుతున్న భేటీపై టీఆర్ఎస్ లోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆగ్రహానికి గురవుతున్న విషయాన్నిటీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తోసిపుచ్చారు.
వచ్చే ఏదాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో తెలంగాణలో హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రోడ్మ్యాప్ను సిద్ధం చేసినట్లు సమాచారం. అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలిపోవడంతో త్రిముఖ పోటీ అధికార పార్టీకి ఉపయోగపడుతుందని కేసీఆర్తో అన్నట్టు తెలిసింది. గత ఎనిమిదేండ్లలో తెలంగాణపై కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఓటర్లకు అవగాహన కల్పించడం ద్వారా టీఆర్ఎస్ అధిక రాజకీయ మైలేజ్ను ఎలా నడపగలదనే దానిపై కూడా కేసీఆర్-పీకేలు చర్చించినట్టు సమాచారం. కేంద్రంలోని బీజేపీ తీరును ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ యోచిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం నుండి రాష్ట్రం నుండి వరి ధాన్యం సేకరించడానికి నిరాకరించడం వరకు.. తెలంగాణ పట్ల వివక్షను చూపిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో కాషాయ పార్టీని ఇరుకున పెట్టడంతో పాటు కమలం దూకుడుకు బ్రేకులు వేయాలనే ప్రణాళికలు రచిస్తోంది అధికార పార్టీ టీఆర్ఎస్. ఇదే విషయంపై పీకే ఇచ్చిన సూచనల ఆధారంగా, పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 27న హైదరాబాద్లో జరగనున్న పార్టీ ప్లీనరీలో కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చే అవకాశం ఉంది. 3 వేల మంది నేతలు హాజరయ్యే పార్టీ జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
అలాగే, కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగే విషయంపై కూడా టీఆర్ఎస్ వైఖరిపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పీకే కాంగ్రెస్లో చేరాలని భావిస్తున్న తరుణంలో ఆయనతో భేటీ జరగడంతో, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసి పని చేస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ టీఆర్ఎస్ సమానదూరంలో ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించే అవకాశం ఉంది. బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తే కేంద్రంలోని కాషాయ పార్టీని ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పీకే సూచించడంతో కేసీఆర్ ఈ విషయాన్ని పీకేకి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా, 2018లో 119 స్థానాలున్న అసెంబ్లీలో 88 స్థానాలు గెలుచుకుని టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన డజను మంది శాసనసభ్యులు కారు ఎక్కడంతో అధికార పార్టీ బలం 100కు పెరిగింది.
