తెలంగాణ కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజంభృస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓ విజ్ఞప్తి చేశారు. 15 రోజుల పాటు తనను ఎవరూ కలవకూడదని ఆయన సూచించారు.

హైదరాబాద్: మరో 15 రోజుల పాటు తనను ఎవరూ కలవవద్దని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ మాత్రమే చేయాలని ఆయన సూచించారు. తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన ఆ ప్రకటన చేశారు.

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తనకు కోవిడ్ కు సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 

ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసివాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆయన వెంట ఉన్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 

తెలంగాణలో నానాటికీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణలో ఒక్క రోజులో 6,209 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనాతో తాజాగా 24 గంటల్లో 29 మంది మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య రాష్ట్రంలో 3.97 లక్షలకు చేరుకుంది.