త్వరలో తెలంగాణలో ఎలక్ట్రిక్ AC బస్సుల పరుగులు! రేపు ‘ఈ-గరుడ’ బస్సుల ప్రారంభం.. హైదరాబాద్లో డబుల్ డెక్కర్లు
తెలంగాణలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రేపు మియాపూర్లో కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తొలుత 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తున్నాయి.
![telangana launching electric AC buses tomorrow, runs between hyderabad to vijayawada kms telangana launching electric AC buses tomorrow, runs between hyderabad to vijayawada kms](https://static-ai.asianetnews.com/images/01h0fc9vhdqbnn1jpk6eadj9gh/whatsapp-image-2023-05-15-at-1-57-38-pm--1--jpeg_363x203xt.jpg)
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో మొత్తం 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ).. తొలుత 10 బస్సులను మంగళవారం నుంచి అందుబాటులోకి తేనుంది. ఈ ఏడాది చివరికల్లా మిగితా బస్సులను అందుబాటులోకి తెస్తుంది. ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సులు ఈ రూట్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని ఇచ్చే ఈ బస్సులకు ‘ఈ-గరుడ’ అనే పేరు పెట్టింది.
వచ్చే రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను తెస్తామని, అందులో 1300 బస్సులు హైదరాబాద్ నగరంలో, 550 బస్సులను దూర ప్రాంతాలకు నడుపుతామని టీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, హైదరాబాద్లో త్వరలో 10 డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభిస్తామని వివరించింది.
ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం రేపు హైదరాబాద్లో జరుగుతుంది. మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చీఫ్ గెస్ట్గా వస్తారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్లు హాజరవుతున్నారు. ‘ఈ-గరుడ’ బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Also Read: రెండు తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బతో పోలీస్ కానిస్టేబుల్ మృతి
ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల స్పెషాలిటీ ఇదే
హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 12 మీటర్ల పొడవైన ఈ బస్సు 41 సీట్ల సామర్థ్యం గలది. ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సైకర్యం, రీడింగ్ ల్యాంప్లను ఏర్పాటు చేశారు. భద్రతా దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ ఉంటుంది. వీటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్కు అనుసంధానిస్తారు. బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలుంటాయి. నెల రోజుల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. ప్రయాణికులను లెక్కించడానికి ఆటోమేటిక్ ప్యాసింజర్ కౌంటర్ కెమెరా, బస్సురివర్స్ చేయడానికి రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల వరకు బస్సు ప్రయాణిస్తుందని టీఎస్ఆర్టీసీ పేర్కొంది.