గ్రూప్‌ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న విద్యార్ధిని ప్రవల్లిక ఆత్మహత్య వ్యవహారంపై తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఫైర్ అయ్యారు . ఉద్యోగాలకు సంబంధించి కేటీఆర్ చెప్పిన గణాంకాలన్నీ తప్పుడు లెక్కలేనని కోదండరామ్ దుయ్యబట్టారు. 

గ్రూప్‌ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న విద్యార్ధిని ప్రవల్లిక ఆత్మహత్య వ్యవహారం తెలంగాణలో కలకలం రేపుతోంది. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఫైర్ అయ్యారు. ఆమె ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వం, కేటీఆర్, పోలీసులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా హైదరాబాద్‌కు వచ్చి ప్రిపేర్ అవుతోన్న ప్రవల్లిక.. ఉద్యోగం వచ్చాకే ఇంటికి వస్తానని చెప్పిందని కోదండరాం అన్నారు. పేపర్ లీకేజ్, పరీక్షరద్దు కారణంగా నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. బాధిత విద్యార్ధిని వ్యక్తిత్వాన్ని చంపేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉద్యోగాలకు సంబంధించి కేటీఆర్ చెప్పిన గణాంకాలన్నీ తప్పుడు లెక్కలేనని కోదండరామ్ దుయ్యబట్టారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం లేదని.. టీఎస్‌పీఎస్సీని రద్దు చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై స్పందన లేదన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెన్షన్లు, రైతుబంధు, గ్యాస్ ధరలు తప్పించి.. యువత, నిరుద్యోగుల విషయంలో ఎలాంటి హామీ లేదన్నారు. ప్రవల్లిక ఆత్మహత్యపై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే భారీగా పోలీసులు వచ్చి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. శివరామ్ వల్లే ప్రవల్లిక ఆత్మహత్య : కుటుంబ సభ్యులు

మరోవైపు.. ప్రవల్లిక ఆత్మహత్య వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు శివరామే కారణమని అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. తన బిడ్డ చావుకు కారణమైన శివరామ్‌కు ఉరిశిక్ష వేయాలని ప్రవల్లిక తల్లి , సోదరుడు డిమాండ్ చేశారు. ఆమె ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమను రాజకీయాల్లోకి లాగి, టార్చర్ పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు ప్రవల్లిక కుటుంబ సభ్యులు. శివరామ్ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. తన బిడ్డకు న్యాయం జరగాలంటే శివరామ్‌కు కఠిన శిక్ష విధించాలని వారు కోరుతున్నారు.