రచయిత చొరవ: మహారాష్ట్ర పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్ర
తెలంగాణ రచయితల రచనలను మహారాష్ట్ర తెలుగు పాఠ్య పుస్తకాల్లో చేరుస్తున్నట్లు పాఠ్య పుస్తకాల మండలి కూడా రవీంద్రకు లేఖ రాసింది. దాంతో సంగివేని రవీంద్ర ఆనందం వ్యక్తం చేశారు.
ముంబై: ఓ రచయిత చొరవతో మహారాష్ట్ర తెలుగు పాఠ్య పుస్తకాల్లోకి తెలంగాణ చరిత్ర ఎక్కుతోంది. మహారాష్ట్ర తెలుగు పాఠ్య పుస్తకాల్లో తెలంగాణా రచయితల రచనలకు, తెలంగాణ చరిత్రకు చోటు కల్పించాలని అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక తరఫున ప్రముఖ కవి సంగివేని రవీంద్ర మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు వినతి పత్రం సమర్పించారు.
ఆయన వినతిపత్రం సమర్పించిన కొద్ది రోజులకే ఇందుకు అవసరమైన చర్యలు చెపట్టాలని గవర్నర్ కార్యాలయం నుంచి పాఠ్య పుస్తకాల మండలికి లేఖ వెళ్లింది. గవర్నర్ ఆ లేఖ రాసిన విషయాన్ని సంగివేని రవీంద్రకు తెలియజేశారు.
అది జరిగిన రెండు నెలలకే తెలంగాణ రచయితల రచనలను మహారాష్ట్ర తెలుగు పాఠ్య పుస్తకాల్లో చేరుస్తున్నట్లు పాఠ్య పుస్తకాల మండలి కూడా రవీంద్రకు లేఖ రాసింది.
దాంతో సంగివేని రవీంద్ర ఆనందం వ్యక్తం చేశారు. తనకు చాల సంతోషంగా ఉందని, ఇది చాల చిన్న విజయమె కావచ్చు గానీ మంచి పరిణామంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందినవారు కావడం విశేషం.