తెలంగాణలోని విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగుతలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఓ మెలికను హైకోర్టు పెట్టింది. ప్రత్యక్ష లేదా పరోక్ష తరగతుల విషయంలో విద్యా సంస్థలే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతులను విద్యా సంస్థలే నిర్ణయించుకోవాలని హైకోర్టు ఆదేశించింది.సెప్టెంబర్ 1 నుండి రాష్ట్రంలో విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు జీవో జారీ చేసింది.ఈ జీవోను సవాల్ చేస్తూ ప్రైవేట్ టీచర్ బాలకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ ను తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. పిటిషనర్ బాలకృష్ణ తరపున న్యాయవాది రవిచందర్ వాదనలు విన్పించారు.
ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.ప్రత్యక్ష తరగతులు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు కోరింది.ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించింది హైకోర్టు.పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.
గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతిగృహాలు తెరవద్దని హైకోర్టు ఆదేశించింది.
గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
స్కూల్స్ పంపే విద్యార్థులు అనారోగ్యం పాలైతే తమకు సంబంధం లేదని యాజమాన్యాలు ముందుగానే పేరేంట్స్ నుండి పత్రాలు తీసుకొంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు తృష్టికి తీసుకొచ్చారు. అయితే యూనిసెఫ్ లాంటి సంస్థలు కూడ విద్యా సంస్థలు తిరిగి తెరవాలని కూడ సూచించిన విషయాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అన్ని వైద్య సదుపాయాలు ఉన్న అమెరికాలోనే రోజుకు లక్ష కరోనా కేసులు వస్తున్నాయని పిటిషనర్ తెలిపారు.సెప్టెంబర్-అక్టోబర్ మాసంలో కోవిడ్ ఉధృతి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.స్కూల్స్ కు రావాలని విద్యార్థులను పంపాలని ఒత్తిడి తీసుకురావద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ స్కూల్స్ కు విద్యార్థులను పంపే విషయమై విచక్షణను పేరేంట్స్ కే వదిలేస్తున్నామని హైకోర్టు తెలిపింది.
పేరేంట్స్ నుండి ఎలాంటి రాత పూర్వక హామీ తీసుకోవద్దని కూడ హైకోర్టు ఆదేశించింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయవద్దని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. విద్యార్థులు, మేనేజ్మెంట్లపై ఒత్తిడి తేవద్దని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం.
