తెలంగాణ గ్రూప్-1  ఫలితాలను సోమవారం వరకు  ప్రకటించవద్దని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలను సోమవారం వరకు ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు విచారణ నిర్వహించింది. ఈ పిటిషన్ పై టీఎస్‌పీఎస్‌సీ ఇవాళ తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. మరోవైపు ఈ విషయమై వాదనలు విన్పించేందుకు సోమవారం వరకు సమయం కావాలని టీఎస్‌పీఎస్ సీ హైకోర్టును అభ్యర్థించింది. సోమవారంనాడు అడ్వకేట్ జనరల్ వాదనలు విన్పిస్తారని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. అయితే అప్పటివరకు గ్రూప్-1 పరీక్ష ఫలితాలను విడుదల చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వరకు ఫలితాలను వెల్లడించబోమని టీఎస్‌పీఎస్‌సీ కూడ హైకోర్టుకు తెలిపింది.

ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షలో చోటు చేసుకున్న ఇబ్బందులను పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలని కోరారు.2022 అక్టోబర్ మాసంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఈ పరీక్షను రద్దు చేసింది టీఎస్‌పీఎస్‌సీ. అయితే 2022 అక్టోబర్ మాసంలో పాటించిన నిబంధనలను 2023 జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ఎందుకు పాటించలేదని పిటిషనర్లు ప్రశ్నించారు.


ఈ విషయమై ఈ ఏడాది జూన్ 22న హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కీలక అంశాలను ఎందుకు విస్మరించారని హైకోర్టు టీఎస్‌పీఎస్‌సీని ప్రశ్నించింది. ఈ పరీక్షకు 3.80 లక్షల మంది పరీక్షలు రాశారు. అయితే టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో బయో మెట్రిక్ వంటి అంశాలను టీఎస్‌పీఎస్‌సీ విస్మరించిందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.