అనంతగిరి భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వండి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం అనంతగిరి భూనిర్వాసితుల పిటీషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు ఈ పిటిషన్ను విచారించింది.
కాళేశ్వరం అనంతగిరి భూనిర్వాసితుల పిటీషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు ఈ పిటిషన్ను విచారించింది. కాళేశ్వరం అనంతగిరి భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలని మొత్తం 120 పిటిషన్లు దాఖలయ్యాయి.
పిటీషన్ తరపున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. కాళేశ్వరం అనంతగిరి ప్రాజెక్టు లో భూముల కోల్పోయిన వారికి పునరావాసం, రీ సెటిల్ మెంట్, నష్టపరిహారం చెల్లించాలని ఆమె న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
భూ నిర్వాసితులను అందరినీ ఆదుకున్నామని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. 2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం, పునరావాసం,రీ సెటిల్ మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లో భూ నిర్వాసితులకు సమస్యలు పరిష్కరించాలని సూచించింది.
కాగా అనంతగిరి నిర్వాసితులు ఇళ్లను ఖాళీ చేసి సహకరించాలని ఆర్డీవో శ్రీనివాసరావు మార్చి 10న ప్రజలకు సూచించారు. అన్నపూర్ణ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించినందున ఎస్సీ కాలనీవాసులు ఇప్పటికే ఇళ్లను ఖాళీ చేశారన్నారు.
ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని, పునరావాస కాలనీలో పనులు పూర్తి అయినందున వెంటనే ఖాళీ చేయాలన్నారు. అనంతగిరి గ్రామానికి చెందిన 12 మంది ఇళ్లను ఖాళీచేయడం వల్ల కూల్చివేశామని, నిర్వాసితులు కోరిన సమయం ఇప్పటికే ఇచ్చామన్నారు. ఏమైన సమస్యలు మిగిలిపోయి ఉంటే పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.