దిశ నిందితుల ఎన్ కౌంటర్  పై తెలంగాణ హైకోర్టులో సోమవారం నాడు విచారణ నిర్వహించింది. ఈ కేసు విచారణను  ఈ నెల  23వ తేదీకి వాయిదా వేసింది. 

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. నిందితులను బూటకపు ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని బాధితుల తరపు న్యాయవాది వాదించారు. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక చేసిన సిఫారసులను బాధితుల తరపు న్యాయవాది వృందా గ్రోవత్ హైకోర్టు ముందుంచారు. నిందితులను బూటకపు ఎన్ కౌంటర్ లో హతమార్చారని గ్రోవత్ చెప్పారు. ఈ విషయమై నివేదిక తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బూటకపు ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని గ్రోవత్ వాదించారు. బాధితుల తరపు వాదనలను విన్న తర్వాత విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 23వ తేదీన తెలంగాణ ప్రభుత్వం తన వాదనలను విన్పించనుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2019 నవంబర్ 28వ తేదీన షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద దిశపై అత్యాచారం చేసి హత్య చేశారు నలుగురు నిందితులు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ విషయమై సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే సమయంలో చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు వెళ్లిన సమయంలో నిందితులు తప్పించుకొనే ప్రయత్నం చేయడంతో జరిగిన ఎన్ కౌంటర్ లో నిందితులు మరణించినట్టుగా 2019 డిసెంబబర్ 6వ తేదీన అప్పటి సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.

also read:దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: తేల్చేసిన సిర్పూర్కర్ కమిషన్

ఈ ఎన్ కౌంటర్ బూటకమని హక్కుల సంఘాల నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై సిర్పూర్కర్ కమిషన్ ను సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది. సిర్పూర్కర్ కమిషన్ 2022 జనవరి మాసంలో సుప్రీంకోర్టు కు అందించింది. ఈ ఎన్ కౌంటర్ బూటకమని ఈ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ విషయమై విచారణ నిర్వహించాలని ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టుకు ఈ ఏడాది మే 20వ తేదీన సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించింది. బాధితుల తరపు వాదనలను హైకోర్టు విన్నది. ఈ నెల 23న ప్రభుత్వం తన వాదనలను విన్పించనుంది.